సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 28న జరిగే గణేశ్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, జలమండలి, గ్రేటర్ డిస్కం, పర్యాటక శాఖలతో పోలీస్ శాఖలు సమన్వయం చేస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్సాగర్, సరూర్నగర్ ట్యాంక్బండ్తో సహా 62చెరువులతో పాటు పీవోపీ విగ్రహాల కోసం ప్రత్యేకంగా 74 కొలనులను ఏర్పాటు చేసి ఇప్పటికే నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం జరిగే శోభాయాత్రకు సంబంధించి ప్రధాన రహదారులతో పాటు నిమజ్జనానికి విగ్రహాలు ప్రయాణించే దాదాపు 303.5 కి.మీల మేర మార్గాల్లో రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా వాహనాలు సాఫీగా సాగేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి 3-4 కిలోమీటర్ల వరకు మొత్తం 25మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. కొలనుల వద్ద ఒక క్రేన్, 7-14 మంది వరకు సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటలు పని చేస్తారని అధికారులు చెప్పారు. నిమజ్జనానికి మొత్తం 126 క్రేన్లు, 130 మొబైల్ క్రేన్లు, 2960 శానిటేషన్ సిబ్బందిని సమకూర్చారు.
ప్రశాంత వాతావరణంలో గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సర్కిల్, ప్యాట్నీ సర్కిల్, ప్యారడైజ్ సర్కిల్, బోట్స్ క్లబ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. శోభాయాత్ర నిర్వహించే మార్గాలలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆదేవిధంగా విగ్రహాలతో వచ్చే వాహనాలకు ఆటంకం కలుగకుండా చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు అడ్డం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు వాటర్వర్క్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలకు స్వాగతం పలికే విధంగా స్వాగత వేదికలను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని వెంట జోనల్ కమిషనర్ రవికిరణ్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు.
535 ప్రత్యేక బస్సులు
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం 28వ తేదీన 535 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని 29 ప్రాంతాల నుంచి ఇందిరాపార్క్, బషీరాబాద్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లక్డీకాపుల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. వివరాల కోసం 99592 26160, 99592 26154 నంబర్లను సంప్రదించాలన్నారు.
రేపు నగరంలో మద్యం దుకాణాలు బంద్
వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 28న మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. 28న ఉదయం 6నుంచి 29న సాయంత్రం 6 గంటల వరకు మూసిఉంచాలని తెలిపారు.