హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దేశానికి ప్రత్యామ్నాయ నేత ముఖ్యమంత్రి కేసీఆరేనని ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) కోరుకుంటున్నారా? రోజురోజుకు మోదీ గ్రాఫ్ పడిపోతున్నదా? అంటే దేశంలో నెలకొన్న పరిస్థితులే కాదు విదేశాల్లో ఉన్న ఎన్నారైల ఇటీవలి కార్యకలాపాలు అవుననే అంటున్నాయి. కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విదేశాల్లో దేశప్రతిష్ఠను దిగజారుస్తున్నారని, శ్రీలంక ఉదంతమే అందుకు నిదర్శమని ఎన్నారైలు ఉదహరిస్తున్నారు.
అలాగే అరబ్దేశాలు దేశంలో నెలకొన్న మత విద్వేష పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే ఆయా దేశాల్లోని భారత రాయబారులను తమతమ ఎంబసీలకు పిలిపించి మందలించిన సందర్భాలను ఎన్నారైలు ఉటంకిస్తున్నారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించాల్సిన మోదీ, బీజేపీ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా దేశాల్లోని ఎన్నారైలు వాపోతున్నారు. బీజేపీకి ఒక నినాదం..విధానం అంటూ లేకుండా పోయిందని ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సఖ్యతగా ఉన్న దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయటమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని, తద్వారా దేశవిదేశాల్లో భారత్ చులకన అవుతున్నదనే అభిప్రాయం ఎన్నారైల్లో వ్యక్తం అవుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్నదని, అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణ రోల్ మాడల్గా నిలిచిందని ఎన్నారైలు నొక్కిచెప్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ యూరప్, ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో ఏర్పాటు చేసిన వివిధ సమావేశాల్లో తెలంగాణ మాడల్ దేశానికి అవసరమనే అభిప్రాయాన్ని ఎన్నారైలు వ్యక్తం చేశారు. ప్రవాస తెలంగాణీయులే కాకుండా గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు చెందిన ప్రవాస భారతీయులు సైతం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అమితాసక్తిని చూపుతున్నారు.
ఇటీవల జరిగిన ఆటా సభల్లో పాల్గొన్న వివిధ రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు రాష్ట్రంలో చేపట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలపై విస్తృతంగా చర్చించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచిన వైనాన్ని ఎన్నారైలు ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్ దక్షత, ముందుచూపు దేశానికి అవసరమని ఎన్నారైలు ముక్తకంఠంతో తీర్మానిస్తున్నారు. అలాగే దేశమంతా కరెంట్ కటకటలతో కకావికలం అవుతుంటే ఒక్క తెలంగాణలో మాత్రమే నిరంతరాయ విద్యుత్తు అందించటం వంటి సాహసోపేత కార్యాచరణ దేశానికి అవసరమని గుజరాత్కు చెందిన ఎన్నారైలు ఇటీవల యూరప్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ నిర్వహించిన సమావేశంలో కీర్తించారు.
దేశంలో మరే పార్టీకి లేనంత ప్రజాబలం, పార్టీ బలం టీఆర్ఎస్కే ఉన్నాయని ఎన్నారైలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీగా ఎన్నారైలు భావించటం లేదని ఇటీవల వివిధ దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల నిర్వహించిన సమావేశాలే నిరూపించాయి. దేశ ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ధైర్యంగా నిలబడగలిగే నాయకుడు కేసీఆర్ అని ఇటీవల జరిగిన పరిణామాలను ఎన్నారైలు విశ్లేషిస్తున్నారు.
పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ లాగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో విఫలమయ్యాయ నే బలమైన అభిప్రాయంతో ఎన్నారైలు ఉన్నారు.
ఇటీవలి కాలంలో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకటం, దేశంలో సహజ, మానవ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోవటంలో కేంద్రం విఫలం కావడం వంటి మౌలిక అంశాలపై కేసీఆర్ సోదాహరణం గా జాతికి వివరించిన తీరు ప్రవాసభారతీయులను అమితంగా ఆకర్షిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లే అయినా ఐటీ, పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ను మంత్రి కేటీఆర్ టెక్నోక్రాట్లా ప్రపంచపటంలో నిలిపారని, ప్రపంచంలోని ఐటీ దిగ్గజ కంపెనీలను దేశానికి రప్పించటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇలాంటి ముందుచూపు దేశానికి అవసరమనే అభిప్రాయాలను ఎన్నారైలు వ్యక్తం చేస్తున్నారు.
‘దేశప్రజల సంరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే తెలంగాణ నుంచే అడుగుపడొచ్చు.. అందుకు కేసీఆరే నడుంకట్టొచ్చు’ అని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఎన్నారైల్లో విస్తృతంగా చర్చ సాగుతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలని బలంగా ఆశిస్తున్నవారికి ఆ ప్రకటన ఎంతో ఊరట కల్పించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ ఏర్పాటు కావాలని, కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ వ్యూహాలే సరైన సమాధానం చెప్తాయని ఎన్నారైలు విశ్వసిస్తున్నారు.
రూపాయి విలువ పతనంలాగే దేశంలో మోదీగ్రాఫ్ పడిపోతున్నదని యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాలతోపాటు అమెరికాలో పలు నగరాల్లో మేం ఇటీవల నిర్వహించిన ఎన్నారై సభలు తేల్చాయి. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేనన్ని శాఖలు టీఆర్ఎస్కు ఉన్నాయి. 52 దేశాల్లో శాఖలున్న ఏ రాజకీయ పార్టీ దేశంలో లేదు. దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రవాస భారతీయులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న మోదీని ఢీకొట్టే సరైన నాయకుడు కేసీఆరే అనే భావన ఎన్నారైల్లో నెలకొన్నది. మేం నిర్వహించిన సభల్లో పాల్గొన్న ఇతర రాష్ర్టాల ప్రవాసీయులు వ్యక్త పరచిన అభిప్రాయాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల శ్రీలంకతోపాటు కొన్ని అరబ్ దేశాల్లో జరిగిన పరిణామాలు భారత్ ప్రతిష్ఠను దిగజార్చాయని, ఎన్నారైల పట్ల ఆయా దేశపౌరులు చులకనగా చూస్తున్నారనే భావన వారిలో నెలకొన్నది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, ఆయనే దేశానికి ప్రత్యామ్నాయ నాయకుడని ఎన్నారైలు భావిస్తున్నారు.
– మహేశ్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్