మెహిదీపట్నం, మార్చి 28 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జి, ఉద్యమ నాయకుడు కావూరి వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీకి కష్ట కాలంలో అండగా నిలిచేందుకు గాను తిరిగి పార్టీలో చేరనున్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కావూరి వెంకటేశ్ తెలిపారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినా తన మనసు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు మాత్రమే ఉందన్నారు. పార్టీ ద్వారా కార్పొరేటర్, ఎమ్మెల్యే టికెట్లు, పార్టీ పదవులు పొందిన వారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని తమ వ్యాపారాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నదని, తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు పాటు పడ్తామని పేర్కొన్నారు. కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు పయనించేలా పాటు కృషిచేస్తానని చెప్పారు.