కందుకూరు, డిపెంబర్ 24 : కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పాఠశాలలు నెలల తరబడి మూత పడటంతో కొందరు విద్యార్థుల్లో పఠన సామర్థ్యం బాగా తగ్గింది. ప్రధానంగా తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యానికి ఏటా ఒక తరగతి చొప్పున మారుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఆంగ్ల పఠనంపై దీని ప్రభావం మరింత పడింది. విద్యార్థులకు పఠన సామర్థ్యం పెంపునకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆగస్టు నుంచి తొలిమెట్టు కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తున్నది. ఇదే తరహాలో భాషా నైపుణ్యాలకు సంబంధించిన పఠనాన్ని మెరుగు పర్చడానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి రీడింగ్ చాలెంజ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నది.
రోజూ చదవాల్సిన పాఠంపై..
ప్రతి పీరియడ్లో పఠనానికి 10-15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. దీని కోసం కేజీబీవీల్లో సబ్జెక్టుకు ఒక్కో సీఆర్పీని ఇన్చార్జిగా నియమించి వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ చదవాల్సిన పాఠాన్ని వాట్సాప్ గ్రూపు వేదికగా సమాచారం అందిస్తారు. దీని ప్రకారం సంబంధిత అంశాన్ని విద్యార్థినులతో చదివిస్తూ ఫోన్ రికార్డు చేస్తారు. దీన్ని మళ్లీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేస్తారు. వీటిని ఆయా సబ్జెక్టుల ఇన్చార్జిలు ప్రతి రోజూ పరిశీలించి ఉత్తమ పఠనాన్ని ఎంపిక చేస్తారు. దీనిని గ్రూపులో పొస్టు చేస్తారు. దీంతో జిల్లాలో ఉత్తమంగా నిలువాలనే పోటీతత్వం విద్యార్థినులు, సబ్జెక్టు సీఆర్పీల్లో పెంపొందుతుంది. పఠన సామర్థ్యాలకు అనుగుంగా విద్యార్థినులను మూడు గ్రూపులుగా విభజించారు. అనర్గళంగా చదివే వారిని మొదటి కేటగిరి (టీ1)గా, మధ్యస్తంగా చదివే వారిని రెండో కేటగిరి (టీ2)గా, నెమ్మదిగా చదవే వారిని మూడో కేటగిరిగా (టీ3)గా విభజించారు. ప్రతి రోజు మూడో విభాగం నుంచి మొదటి విభాగంలోకి మారేలా పఠనా సామార్థ్యాన్ని పెంపొందించడం ఒక సవాల్గా స్వీకరించి నిర్వహిస్తున్నారు. రీడింగ్ చాలెంజ్ కార్యక్రమాన్ని తెలుగు, హిందీ ఆంగ్లంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో అమలు చేస్తున్నారు.
చదివే సామర్థ్యం పెరుగుతుంది..
విద్యార్థినులను టీ1,టీ2,టీ3, గ్రూపులుగా విభజించి ప్రతి రోజు సాయంత్రం రెండు క్లాస్లు తీసుకుంటున్నాం. దీనివల్ల చదివే సామర్థ్యాలు పెరుగుతున్నాయి. వసతి గృహాల్లో మధ్యలో చేరిన కొందరు వెనుకబడి ఉన్నారు. వారికి కూడా బేసిక్స్ నేర్పుతున్నాం. రీడింగ్ చాలెంజ్లో గణితం సబ్జెక్టును కూడా చేర్చారు.
– భార్గవి, కస్తూర్బా గాంధీ బాలికల ప్రిన్సిపాల్, కందుకూరు
రోజు పాఠాలు చదివిస్తున్నారు..
రీడింగ్ చాలెంజ్ ప్రోగ్రాం ప్రతి రోజు నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ఎంపిక చేసిన పాఠాలను రోజు చదివిస్తున్నారు. దీంతో చదవడం, రాయడం బాగా నేర్చుకుంటున్నాం. ధారళంగా చదవడానికి ఇది మంచి కార్యక్రమం.
– మహేశ్వరి, విద్యార్థిని