సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): ఎవరైనా దత్తత తీసుకుంటే శిశు సంక్షేమ శాఖ విధించిన నియమ నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నట్లు కరాటే కల్యాణిపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు కరాటే కల్యాణికి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ జరిగితే రూ.లక్ష జరిమానా, మూడేండ్లు జైలు శిక్ష విధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దత్తత తీసుకోలేదు..: కల్యాణి
తాను పసి బిడ్డను దత్తత తీసుకున్నట్టుగా వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సినీనటి కరాటే కల్యాణి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి అమీర్పేట్లోని ఓ హోటల్లో పాప, తల్లిదండ్రులతో కలిసి కరాటే కల్యాణి విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా మాల్కు చెందిన ఆటోడ్రైవర్ గోవర్ధన్, స్వప్న దంపతుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వారి కుటుంబానికి తాను అండగా ఉన్నానని, వారి కూతురు మౌత్తిక సంరక్షణను తాను మరింత మెరుగ్గా చూడగలననే నమ్మకంతోనే తన దగ్గర ఉంచారని తెలిపారు. శివ శక్తి సంస్థ కుట్రల ఫలితంగానే తనపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని ఆరోపించారు. అయితే విలేకర్ల సమావేశం జరుగుతున్న హోటల్కు చైల్డ్ లైన్ అధికారులు వచ్చి పాపకు సంబంధించిన అన్ని వివరాలతో కలెక్టరేట్లోని సీడబ్ల్యుసీ కార్యాలయానికి రావాలని సూచించారు. తాను వెంటనే రాలేనని.. పూర్తి వివరాలతో కొద్ది రోజుల్లో వస్తానని కల్యాణి అధికారులకు వివరించారు.