మియాపూర్ , జనవరి 21 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు రూ. 16,01,856 మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే, కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి మియాపూర్ క్యాంపు కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ పథకం పేద యువతుల పెండ్లికి చక్కగా ఉపయోగపడుతుందన్నారు.
పేద ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని , దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించేలా చిత్తశుద్ధితో కృషి చేస్తానని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రఘునాథ్రెడ్డి, గౌతం గౌడ్, గోపాల్రావు,వెంకటేశ్, శివ , రవి పాల్గొన్నారు.