బంజారాహిల్స్, జూన్ 13: కరోనా కష్ట కాలంలో షూటింగ్స్ లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా సినీ వర్కర్లకు ‘మనం సైతం’ సంస్థ ద్వారా ఆదివారం నిత్యావసర వస్తువులను అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లో ‘తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్’ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు కాదంబరి కిరణ్ కుమార్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ఏడేండ్లుగా మనం సైతం సంస్థ ద్వారా సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని, గతేడాది లాక్డౌన్ సమయంలో ఎంతోమంది పేద కళాకారులకు అండగా నిలిచామన్నారు. కార్యక్రమంలో లలిత, సీసీ శ్రీను, రమేశ్ రాజా, నారాయణ పాల్గొన్నారు.