బంజారాహిల్స్, మార్చి 11: మద్యం మత్తులో కారు నడపడంతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్రెడ్డి, సంతోష్, అరవింద్తో పాటు మరో యువకుడు కలిసి ఆదివారం రాత్రి కొండాపూర్లో జరిగిన విశాల్ అనే స్నేహితుడి బర్త్డే పార్టీలో పాల్గొన్నారు. పార్టీ ముగించుకుని సోమవారం తెల్లవారుజామున కారులో జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 మీదుగా వెళ్తున్నారు. పీకలదాకా మద్యం సేవించిన మల్లికార్జున్రెడ్డి అతివేగంగా కారు డ్రైవింగ్ చేయడంతో.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో పాటు బీభత్సం సృష్టించింది.
కారు ముందు భాగం తుక్కుతుక్కయ్యింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని.. కారు డ్రైవింగ్ చేసిన మల్లికార్జున్రెడ్డితో పాటు అతడితో పాటు ఉన్న మిగిలిన ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా.. అందరు మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన మల్లికార్జున్రెడ్డితో పాటు మిగిలిన ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.