బంజారాహిల్స్, ఆగస్టు 30 : అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించి ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకుని ఇటీవల లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారి వివరాలను ఎమ్మెల్యే బుధవారం ప్రకటించారు. జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులుగా ఎంపికైన వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన నియోజకవర్గంలో తొలి విడతగా ఎంపికైన 500 మంది లబ్ధిదారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించినప్పుడు ఎవరూ నమ్మలేదని, పేదల కలలు సాకారం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలివిడతగా 12వేల మందికి ఇండ్లను పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా కేటాయించి చరిత్ర సృష్టించామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్.రెడ్డి, దేదీప్యరావు, సంగీతాయాదవ్తోపాటు అన్ని డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ, ప్రదీప్. కృష్ణమోహన్, సంతోష్, నాయకులు విజయసింహ, విజయ్కుమార్, సిరాజ్, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.