సిటీబ్యూరో: హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ నీటి పారుదల శాఖ నుంచి అందిన ఫిర్యాదుతో సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం..ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ స్థలాలను పరిశీలించింది.
కాగా ఈ వివాదాస్పద నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ నివేదిక అందిన తర్వాత రికార్డులను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సంయుక్తంగా అధికారుల బృందం ప్రకటించింది. మరోవైపు ముగ్గురు ఉన్నతాధికారులు ఒక్కసారిగా క్షేత్రస్థాయిలోకి రావడంతో అధికారులతో పాటు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే సీఎంవో నుంచి ఫోన్కాల్స్ మేరకే హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు హుటాహుటిన హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని అక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలపై ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది.