సిటీబ్యూరో, అక్టోబరు 12(నమస్తే తెలంగాణ): పదోన్నతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న టీఎస్ఎస్పీ హెడ్కానిస్టేబుల్ను మంగళవారం సైబరాబాద్ ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం హైదర్షాకోట్ల శాంతినగర్కు చెందిన బోయ షేక్ షావలీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఉప్పలపాడు.
షేక్ షావలీ గతంలో చాలా మంది మంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల వద్ద ఐఎస్డబ్ల్యూ పీఎస్ఓగా పని చేశాడు. ఆ సమయంలో వారితో కలిసి దిగిన ఫొటోలు చూపుతూ తనకు చాలా పలుకుబడి ఉందని ప్రచారం చేసుకున్నాడు. ఏపీ ప్రభుత్వంలోని ఏ విభాగంలోనైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు. షేక్ షావలీ మాటలు నమ్మి నార్సింగి పోలీసు స్టేషన్కు చెందిన నరసింహ ఏపీ జెన్కోలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కోసం రూ.10 లక్షలు ఇచ్చాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తుండటంతో మోసపోయానని గ్రహించిన నరసింహ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే షేక్ షావలీ 2019లో రోడ్డు ప్రమాదానికి గురై లీవ్లో ఉంటూ ఇలా మోసాలకు పాల్పడుతూ దాదాపు 14 మంది వద్ద 1.68 కోట్లు వసూలు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలా వసూలు చేసిన డబ్బుతో షేక్ షావలీ రెండు లారీలు, రెండు ఇండ్లు, ఖాళీ స్థలాన్ని కొన్నాడు. అంతేకాకుండా ఓ ఫ్లాట్ను కొనుగోలు చేసేందుకు ఏకంగా అదనపు ఎస్పీ ఇంటిలిజెన్స్ అధికారిగా ఐడీ కార్డును తయారు చేసుకుని బ్యాంక్ అధికారులను కూడా బురిడీ కొట్టించినట్లు స్పష్టమైంది. ఇలా మోసాలకు పాల్పడిన షేక్ షావలీని మంగళవారం ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి లారీ, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.