మెహిదీపట్నం ఆగస్టు 16: క్రైం రిపోర్టర్గా ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇంటర్వ్యూలకు కెమెరాలతో రావాలని చెప్పి అమాయకుల వద్ద కెమెరాలు దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి 11 కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట ఏసీపీ గణేశ్, ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ నాగయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. తిరుపతి ఎస్ఎన్పురానికి చెందిన చుంచు ప్రవీణ్కుమార్ అలియాస్ ప్రభు కుమార్(32) లోతుకుంటలో ఉంటున్నాడు. నటనలో శిక్షణ పొంది పలు సీరియల్స్, సినిమాల్లో సైడ్, జూనియర్ ఆర్టిస్ట్గా నటించాడు. ఈ క్రమంలో తాగుడు ,జల్సాలకు అలవాటుపడ్డాడు. షూటింగ్ల సమయంలో అక్కడ కెమెరామెన్లు విలువైన కెమెరాల గురించి చర్చించుకోవడం గమనించాడు. తనకు ఆదాయం సరిపోకపోవడంతో కెమెరాలను దొంగిలించాలని పథకం పన్నాడు. కొన్ని రోజులు ఓ యూట్యూబ్ చానల్లో క్రైం రిపోర్టర్గా కూడా పనిచేశాడు. దీన్ని అవకాశంగా చేసుకుని టీవీ క్రైం రిపోర్టర్లుగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కెమెరాలతో ఇంటర్వ్యూలకు రావాలని పిలిచేవాడు. అలా వచ్చిన వారిని మాయమాటలతో మభ్య పెట్టి కెమెరాలను దొంగిలించి పారిపోయేవాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ నాగయ్య తన బృందంతో విచారణ చేపట్టి సోమవారం ప్రవీణ్కుమార్ను నాగార్జున సర్కిల్ సమీపంలో పట్టుకున్నారు.