అబిడ్స్, జనవరి 9 : గోల్కొండ ఫోర్ట్ ప్రాంతానికి చెందిన యువ ఇంజినీర్, నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు మహ్మద్ మన్ననుల్లా ఖాన్ నిరుద్యోగులు ఇబ్బందులు పడవద్దని నిర్ణయించుకున్నాడు. మొదటి సారి 2021లో డెక్కన్ బ్లాస్టర్స్ పేరిట పలు కంపెనీలతో మాట్లాడారు. లక్డీకాపూల్లోని ఉడ్బ్రిడ్జి హోటల్లో జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. పదో తరగతి పాస్ కాక పోయినా.. వారి అర్హత ప్రకారం ఉద్యోగాలు లభించేలా చూస్తున్నారు. గతేడాది జాబ్ మేళాలను ప్రారంభించి 66 జాబ్ మేళాలను నిర్వహించి తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అమెజాన్, స్విగ్గి, జొమాటో, పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, రిలయన్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్. విజయ్ సేల్స్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తున్నారు. మంగళవారం బెంగళూర్లో 67వ జాబ్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
వారానికి ఓ జాబ్ మేళా.. ఇంజినీర్ మహ్మద్ మన్ననుల్లా ఖాన్ జనవరి 16న బెంగళూరులో, 21 న నాంపల్లి రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో మేళాలను నిర్వహిస్తున్నట్లు లిపారు. ఆయన తండ్రి మహ్మద్ జఫరుల్లా ఖాన్ ఆలిండియా పోస్టల్ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శిగా పని చేసి కేశవగిరిలో పోస్ట్మెన్గా విధులు నిర్వహిస్తూ నిరుద్యోగులకు తన వంతు సహాయం చేశాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని మన్ననుల్లా ఖాన్ జాబ్ మేళాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
మరిన్ని జాబ్ మేళాలను నిర్వహించేందుకు కృషి
2023 లో మరిన్ని జాబ్ మేళాలను నిర్వహించేందుకు కృషి చేస్తా. నగరంతో పాటు బెంగళూర్లో జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. 10, 16 తేదీల్లో బెంగళూర్, 21న తిరిగి హైదరాబాద్లో జాబ్ మేళాలను నిర్వహించనున్నాం. తల్లిదండ్రుల ఆశీర్వాదం మరింత ముందుకు సాగేలా చేసింది. పలు కంపెనీలు, స్నేహితుల సహకారంతో జాబ్ మేళాలను విజయవంతం చేయగలుగుతున్నా. -మహ్మద్ మన్ననుల్లా ఖాన్, బ్లాక్ బస్టర్ వ్యవస్థాపకులు