సిటీబ్యూరో, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి సాంకేతిక విద్యా విధానంలో మెరుగైన విద్యా విధానం అందించడంతో పాటు ఉపాధి గ్యారంటీ కోర్సులను కూడా అందించాలన్న లక్ష్యంతో ముందుకు పోతుంది. అందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు. అందులో భాగంగా తొలుగా జాతీయ స్థాయిలోని అన్ని సాంకేతిక యూనివర్సిటీలకు చెందిన వైస్ ఛాన్సలర్లతో జాతీయ సదస్సు నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. వచ్చే నవంబర్లోనే ఆల్ ఇండియా వైస్ ఛాన్స్లర్లతో హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.
వీసీల సమావేశం కోసం ఇప్పటికే ప్రణాళికులు సిద్ధం చేసినట్లు జేఎన్టీయూ హైదరాబాద్ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యలో ఏయే రాష్ర్టాలలో ఎలాంటి కొత్త విధానాలు అవలంభిస్తున్నారు..? ఏయే యూనివర్సిటీలలో విద్యాభివృద్ధి పద్ధతులు కొనసాగుతున్నాయి..? ఏయే కోర్సులు పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి..? ఐటీ రంగం, ఉత్పాదక రంగాలలో యువతకు ఎలాంటి ఉద్యోగాలు లభిస్తున్నాయో తెలుసుకోవడానికి వీసీల సదస్సు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వర్సిటీ అధికారులు తెలిపారు.
వచ్చే నెలలో నిర్వహించనున్న వీసీల సమావేశంలో కేవలం యూనివర్సిటీల నుంచే కాకుండా దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలకు చెందిన డైరెక్టర్లతో పాటు పలు కేంద్రీయ విశ్వ విద్యాలయాలకు చెందిన వీసీలను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించనున్నామని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సదస్సులు యూనివర్సిటీ వీసీలు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఉంటాయన్నారు. దాని వల్ల జేఎన్టీయూహెచ్లో కూడా ఇంజినీరింగ్, ఫార్మసీలో జాబ్ గ్యారంటీ కోర్సులు ప్రవేశ పెట్టడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.