కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 3: సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా నూతన ఆవిష్కరణలను చేపట్టాలని, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ఆదివారం జేఎన్టీయూ వర్సిటీ స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్, జేఎన్టీయూ వర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందర్రాజన్, వైస్ చాన్స్లర్ కట్ట నరసింహారెడ్డి, రెక్టార్ ఎ.గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వర్సిటీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్మోహన్, సెక్రటరీ సురేంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీలో స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించడంతో పాటు వర్సిటీ ప్రాంగణంలో నిర్మించనున్న పూర్వవిద్యార్థుల అసోసియేషన్ భవనం (అలుమ్ని) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వర్సిటీలో మొక్కను నాటి నీరు పోశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఏర్పడిన జేఎన్టీయూ 50 వసంతాలకు చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. వర్సిటీలో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత పదవులతో సమాజానికి సేవలందిస్తున్నారని తెలిపారు. వర్సిటీలో గత 50 ఏండ్ల కాలంలో 19లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం గొప్ప విషయమన్నారు. జేఎన్టీయూ పూర్వవిద్యార్థులు వర్సిటీ అభ్యున్నతి కోసం సలహాలు, సూచనలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో వివిధ వర్సిటీల వైస్ చాన్స్లర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఆయా విభాగాల అధిపతులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.