కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 1 : జేఎన్టీయూహెచ్ వర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలు వచ్చే జూన్ 3 నుంచి ఏడాది పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ కట్ట నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం వర్సిటీ స్వర్ణోత్సవాలపై వర్సిటీ వైస్ చాన్స్లర్ రెక్టార్ ఎ.గోవర్దన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు.
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ జూన్ 3న ఈ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా ఏడాదంతా సదస్సులు, కార్యశాలలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను, పూర్వ విద్యార్థులతో సమ్మేళనం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులతో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
1972 అక్టోబర్ 2న దేశంలోనే తొలి సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిన జేఎన్టీయూకు శనివారంతో 50వ వసంతంలోకి చేరుకుంటుందని వీసీ నర్సింహారెడ్డి తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్తో పాటు కాకినాడ, అనంతపూర్, ఆర్టెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలు ఏర్పడ్డట్టు తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా కొండగట్టు (జగిత్యాల), మంథని (పెద్దపెల్లి), సుల్తాన్పూర్ (మెదక్) లలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయని.. ఈ ఏడాది కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బీటెక్లో 24, ఎంటెక్లో 64, ఎంఫార్మసీలో 11 కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏఎం, ఫార్మడీ లాంటి కోర్సులు ఉన్నట్లు తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా 232 కళాశాలలు ఉండగా.. వీటిలో 149 ఇంజినీరింగ్ కళాశాలలు, 73 ఫార్మసీ కళాశాలలు, 10 ఎంసీఎం, ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. ప్రతియేటా 2.7 లక్షలకు పైగా విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నట్లు తెలిపారు.