మహిళా భద్రత, ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులపై నెలల తరబడి ఫిర్యాదులు చేసినా వ్యవస్థ స్పందించకపోవడంతో ఒక భాదితురాలు చివరకు న్యాయం కోసం ప్రజాభవన్ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోన్ జీడిమెట్ల సర్కిల్లో ఎస్ఎఫ్ఏగా పనిచేస్తున్న జీవీఎస్ జానకి మంగళవారం ప్రజావాణి నోడల్ అధికారికి సమర్పించిన వినతిపత్రం మున్సిపల్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
– కుత్బుల్లాపూర్, జూన్ 23
కుత్బుల్లాపూర్, జూన్ 23: 25 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీలో ఎటువంటి మచ్చలేకుండా నిఖార్సయిన సేవలు అందిస్తున్న తనను జీడిమెట్ల సర్కిల్ డీసీ శంకర్సింగ్ కావాలనే లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నాడని జానకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తోటి సిబ్బంది ముందే అవమానించడం, మానసిక క్షోభకు గురిచేయడంపై ఇప్పటికే కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్కు రెండు సార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి, రాష్ట్ర మహిళా కమిషన్కు సైతం ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, కమిషన్ నుంచి రాలేదు. గత రెండు నెలలుగా న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే చివరి ఆశగా ప్రజాభవన్కు ఆశ్రయించినట్లు భాదితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.
కుమార్తె నియామకంపైనా విచారణ చేయాలి
ఈ వేధింపుల వెనుక డీసీ బంధుప్రీతి, అధికార దుర్వినియోగం దాగి ఉందనే అనుమానాన్ని భాదితురాలు వ్యక్తం చేసింది. డీసీ శంకర్సింగ్ కుమార్తె ప్రస్తుతం కూకట్పల్లి జోనల్లోని ఎస్ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని, ఆమె నియామకం, కొనసాగింపునకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మంజూరి, అవుట్సోర్సింగ్ రికార్డులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని భాదితురాలు జానకి ప్రభుత్వాన్ని కోరింది.
రక్షణ కల్పించాలని విన్నపం..
తాను ఓ వితంతువునని, ఇద్దరు పిల్లల భాద్యత తనపై ఉందని పేర్కొంటూ.. తన లాగిన్ ఐడీని పునరుద్ధ్దరించి, విచారణ పూర్తయ్యే వరకు తనపై ఎలాంటి ప్రతీకార చర్యలు లేకుండా రక్షణ కల్పించాలని భాదితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంది. బల్దియాలోని కొందరు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతస్థాయి అధికారులు స్పందించి న్యాయం చేస్తారో..లేదో చూడాలి.