మన్సూరాబాద్ : గుండెపోటు వచ్చిన సమయంలో అత్యవసరంగా మొదట చేపట్టాల్సిన ప్రాథమిక చికిత్స సీపీఆర్ (CPR)విధానం పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayana) తెలిపారు. గుండెపోటు వచ్చిన సమయంలో అత్యవసరంగా నిర్వహించే సీపీఆర్ ప్రథమ చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక కార్యకర్తలు దోసపాటి రాము, యశస్విని జొన్నలగడ్డ ఆధ్వర్యంలో కోడ్ బ్లూ పేరుతో చేపట్టనున్న కార్యక్రమాల బ్రోచర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. సీపీఆర్ చేయడం ద్వారా మనిషి జీవితాన్ని కాపాడవచ్చనే సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేకం జరిగాయన్నారు.
సీపీఆర్ చేయడాన్ని ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో సామాజిక కార్యకర్తలు దోసపాటి రాము, యశస్విని జొన్నలగడ్డ కోడు బ్లూ పేరుతో చేపడుతున్న కార్యక్రమాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటు, ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి యువతకు సరైన శిక్షణను ఇస్తే ఇంటికి ఒక సీపీఆర్ వాలంటీర్ తయారు చేయవచ్చునన్నారు.