జవహర్నగర్, మార్చి 27: స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ జవహర్నగర్ కార్పొరేషన్ ఆదర్శంగా నిలుస్తుంది. సుమారు 100కాలనీలతో అతి పెద్ద కార్పొరేషన్గా అవతరించిన జవహర్నగర్ ఎటు చూసినా పరిశుభ్రత,పచ్చదనంతో వెల్లివిరిస్తుంది. కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు చెత్త సేకరణకు ఆటోరిక్షాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తడి,పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని ప్రతి ఇంటికీ రెండు డబ్బాలను కూడా అందజేసింది. ప్రభు త్వం ప్రతి ఇంటికి 6 మొక్కలను అందజేసి..కాలుష్య రహితంగా నిలిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో స్వచ్ఛ జవహర్నగర్ కార్పొరేషన్గా నిలుస్తుంది.
కార్పొరేషన్లోని కొన్ని ప్రాంతాల్లో చెత్తను బహిరంగంగా వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చెత్తను తినేందుకు కుక్కలు, పందులకు నిలయం గా మారుతూ బాటసారులపైకి వచ్చి కరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని ప్రజలకు అవగాహన కల్పిస్తూ… నిర్లక్ష్యం చేసిన వారి కి అధికారులు జరిమానా విధించి కఠిన చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని 14 స్థలా ల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగించే దుకాణాలదారులకు జరిమానాలు విధిస్తున్నారు.
ప్రజలు దోమకాటుతో అనారోగ్యానికి గురికావొద్దని ప్రతి కాలనీలో ఎంటామాలాజీ సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. మురుగు కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యాంటీ లార్వా బాల్స్, మార్కెట్లు, మాంసం దుకాణాలు, పబ్లిక్ టాయిలెట్ల వద్ద ఈగలు వాలకుండా రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. కార్పొరేషన్లోని 28 డివిజన్లలో ఫాగింగ్ చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
స్వచ్ఛతలో ఆదర్శంగా జవహర్నగర్ను తీర్చిదిద్దుతున్నాం. ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరించడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్ వాడరాదని దుకాణాదారులకు అవగాహన కల్పించాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించాం. కొత్తగా ఫాగింగ్ యంత్రాలను కూడా తీసుకువస్తాం.
– రామలింగం, కమిషనర్ జవహర్నగర్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జవహర్నగర్ కార్పొరేషన్ రూపురేఖలు మారాయి. అభివృద్ధికి దూరం గా ఉన్న కార్పొరేషన్ మంత్రి మల్లారెడ్డి సహకారంతో రూ.100 కోట్లతో జవహర్నగర్ ప్రగతి పథంలో దూసుకెళ్లింది. మంత్రి కేటీఆర్ కార్పొరేషన్కు తాజాగా రూ. 25కోట్లు కేటాయించారు. దీంతో కొన్ని కాలనీల్లో ఉన్న పెండింగ్లో ఉన్న పనులు పూర్తిగా పరిష్కారం అవుతాయి.
– మేయర్ కావ్య జవహర్నగర్ కార్పొరేషన్