Gajjala Kantham | కవాడిగూడ, మార్చి 9: రాష్ట్రంలో మాదిగలకు రెండు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. శనివారం లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్స్థాయి మాదిగల సమ్మేళనం వాల్పోస్టర్ర్లను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ.. రిజర్వ్ స్థానాల్లో రెండు, ఒకటి జనరల్ స్థానంలో మాదిగలకు మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని అన్నారు.
పిడమర్తి రవి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మాదిగ సమ్మేళనం ఈనెల 10 నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. మొదటగా జహీరాబాద్ సమ్మేళనం ఉంటుందని, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లతోపాటు రాష్ట్ర కేబినెట్లో సముచిత స్థానం కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ యాదన్న, దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మొగులయ్య, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేశ్మాదిగ, మాదిగ జేఏసీ గ్రేటర్ అధ్యక్షుడు నక్క మహేశ్, చింతయ్య, ధర్మేందర్, సంజీవ్, రాములు, విజయ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.