ఖైరతాబాద్, నవంబర్ 4: సంతాన సాఫల్య ప్రక్రియలో భాగంగా తన అండాలను దానం చేసేందుకు వెళ్లిన ఓ యువతి తీవ్ర అస్వస్థత పాలైంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర, జల్నా జిల్లా చందన్జీరాలోని సుందర్నగర్కు చెందిన ఓ యువతి (25) ఐదు నెలల కిందట నగరానికి వచ్చి అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఆమె ఐవీఎఫ్ ప్రక్రియలో భాగమైన అండ దానం చేసేందుకు సిద్ధమైంది. అందుకోసం జూబ్లీహిల్స్కు చెందిన ఓ ఏజెంట్ను ఆశ్రయించింది.
సదరు ఏజెంట్ ఆ యువతిని హబ్సిగూడలోని ప్రసాద్ హాస్పిటల్లో చేర్పించింది. అండాల వృద్ధికి అవసరమైన ఇంజక్షన్లు ఇచ్చి గత నెల 26న అదే దవాఖానలో అండాలను సేకరించారు. ఆ తర్వాత ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురవుతూ వచ్చింది. ఆమె కడుపు అమాంతంగా ఉబ్బిపోవడంతో కుటుంబసభ్యులు సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నది. బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.