సిటీబ్యూరో, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. సాఫ్ట్వేర్ కంపెనీల నిర్వహణ కోసం అవసరమైన గ్రేడ్ ‘ఏ’ కమర్షియల్ ఆఫీస్ స్పేస్, పరిశోధనా అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే నగరం మూలబిందువుగా మారగా.. భారత దేశ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును మించి వృద్ధి రేటు సాధిస్తున్నది. దేశంలోనే అత్యధికంగా ఐటీ సెజ్లు(ఐటీ పార్కు) ఉన్న నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో మరిన్ని ఐటీ పార్కుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అయితే హైదరాబాద్లో ఐటీ రంగం వృద్ధి రేటు, ఈ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ జోన్స్ లాంగ్ లాసెలే(జేఎల్ఎల్) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. నగరంలో పెట్టుబడులు పెట్టే వారికి ఉపయోగపడే పలు అంశాలను ఈ నివేదికలో పొందుపర్చారు. హైదరాబాద్లో 53 ఐటీ పార్కులు ఉన్నాయని.. దేశీయ ఐటీ రంగం ఎగుమతుల్లో 16శాతం ఇక్కడి నుంచే జరుగుతున్నాయని.. ప్రతి సంవత్సరం ఈ ఎగుమతుల్లో వృద్ధి రేటు భారీగా నమోదవుతున్నదని నివేదికలో పేర్కొంది.
టెక్నాలజీ రంగంలో టాప్ టెన్ కంపెనీలుగా ఉన్న ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాప్ట్, ఉబర్, గూగుల్, క్వాల్కామ్ వంటి కంపెనీలు అగ్రరాజ్యం తర్వాత హైదరాబాద్ కేంద్రంగా అతి పెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, బల్క్ డ్రగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక రంగాలకు చెందిన కంపెనీల కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. అయితే ఆయా రంగాల్లో పని చేసేందుకు అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నగరంలో కొదవ లేదు.
ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తూ ఉంటుంది. అలాంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించి.. ఆయా టెక్నాలజీస్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ పేరుతో పలు సాంకేతిక పరిజ్ఞానాలను ప్రత్యేకంగా గుర్తించింది. ఇందులో డ్రోన్ టెక్నాలజీ, నానో సైన్స్, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), స్వీయ ఆధారిత కారు సాంకేతికత (సెల్ఫ్ డ్రైవెన్ కార్ టెక్నాలజీ), బిగ్డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీఆర్ అండ్ ఏఆర్, త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్చైన్ వంటివి ఉండగా.. ఈ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికే అత్యధికంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీ పరిధిలో ఉన్న సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనూర్ సంస్థ ఆధ్వరంలో ఔత్సాహికులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నది. ఇప్పటికే స్టార్టప్లకు వేదికగా ఉన్న సీఐఈలో కొత్తగా ఎమర్జింగ్ టెక్నాలజీల్లో విద్యార్థులకు నైపుణ్యం పెంచే కోర్సులను నిర్వహిస్తున్నది. ఎమర్జింగ్ టెక్ స్టార్టప్ పేరుతో శిక్షణనివ్వడంతో పాటు ఎవరికైనా కొత్త ఆలోచనలు ఉంటే వారితో స్టార్టప్లను ఏర్పాటు చేయించి, అన్ని విధాలుగా సహకరించేందుకు సీఐఈ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది.