ప్రపంచం మెచ్చిన నగరం.. పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ దార్శనికత, విధివిధానాలతో ఐటీలో హైదరా‘బాద్’షాగా దూసుకుపోతున్నది. ఏ ఏటికాయేడు వృద్ధి రేటు రెట్టింపవుతూ వస్తుండగా, ఏడేండ్లలో అదనంగా సుమారు 3లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు లభించాయి. ఎన్నో బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ వేదికగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాలు అద్భుత ప్రగతిని సాధించాయి. గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఏడేండ్ల కాలంలో ఆకాశమే హద్దుగా మన ‘రాజ’ధాని మేటిగా నిలిచినట్లు వెల్లడించారు.
ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకోవడంలోనూ బెంగళూరును మన నగరం దాటేసింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ఐటీతో పాటు ఈ రంగం కూడా హైదరాబాద్ కేంద్రంగా మంచి వృద్ధి రేటు కనబర్చింది. కరోనా ఎఫెక్ట్తో ఆర్థిక మాంద్యం ఉన్నా.. ‘రియల్’ భూమ్ స్థిరంగా నిలిచింది.
ఎఫ్డీఐ ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ దప్యూచర్ 2020-21 ర్యాంక్సింగ్స్లో టాప్ 10 ఏరోసిటీస్ కేటగిరీలో నగరం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) 28వ కన్వర్జెన్స్ ఇండియా -2021 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, 6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో హైదరాబాద్కు గ్రీన్ అండ్ క్లీన్ సిటీ, స్మార్ట్ వేస్ట్ డిస్పోజల్, స్టార్టప్ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి.
నగరానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ కంపెనీలతో పాటు వివిధ పరిశ్రమలు గ్రేటర్ చుట్టూ విస్తరిస్తున్నాయి. ముచ్చర్ల వద్ద ఫార్మా సిటీ నిర్మాణం, చందన్వెల్లి, చౌటుప్పల్ సమీపంలో, పటాన్చెరువు సుల్తాన్పూర్ వద్ద పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట ఉన్న పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చందన్వెల్లిలో 500 ఎకరాల్లో క్లస్టర్ను ఏర్పాటు చేయగా, పలు కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
పారిశ్రామిక రంగాల్లో మంచి పురోగతి సాధించాం. సీఎం కేసీఆర్ విధివిధానాలు, సమష్టి కృషితోనే ఈ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైంది. – మంత్రి కేటీఆర్