మాదాపూర్, జనవరి 23: దేశంలో బ్యాటరీ తయారీ సరఫరా, పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్, సైప్లె చైన్ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ విచ్చేసి సీఈఎస్ ఇండియా ఎండీ, అధ్యక్షుడు, ఐఈఎస్ఏ అధ్యక్షుడు రాహుల్ వాలవాల్కర్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ జేఎస్, డాక్టర్ వీణా కుమారి, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సీనియర్ ఎకనామిక్ అధికారి ఫ్రాంక్ టలుటో, కబిల్ సీఈఓ సదాశివ్ సామంతరాయ్, అమర్రాజ బ్యాటరీస్ అధ్యక్షుడు విజయానంద్ సముద్రాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ, ఏసీసీ, పీఎల్ఐ కింద జాతీయ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ర్టాలు అందించిన మద్దతుతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు ఇచ్చిన మద్దతుకు మన దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయన్నారు. 2030 నాటికి 150 గిగావాట్ల ఏసీసీని సులభంగా అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు. 2030 నాటికి 150 గిగావాట్ల ఏసీసీ లక్ష్యాన్ని సాధించవచ్చని ధీమా వ్యక్త చేశారు. మన దేశంలో తయారయ్యే 150 ఏసీసీ గిగావాట్ బ్యాటరీ ఉత్పత్తిలో 30 గిగావాట్లు మన రాష్ట్రంలోనే తయారు కావడం గొప్ప విషయమన్నారు. ఈ బుధవారం వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో 300లకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు.