మాదాపూర్, మే 12: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు వివిధ రకాల ఉత్పత్తులు, సేవలను సృష్టిస్తుండటంలో ఎంఎస్ఎంఈలు ఇతోధికంగా కృషి చేస్తున్నాయని ఎంఏఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, డాక్టర్ ముత్తురామన్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇండోమాచ్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు.
ప్రమోషన్ కౌన్సిల్ అనేది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగ సాధికారత కోసం పని చేసే లాభాపేక్ష లేని సంస్థ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రామాదేవి మాట్లాడుతూ ఇంజినీరింగ్, భారీ యంత్రాలు, ఉపకరణాల పరిశ్రమలు దేశానికి వెన్నెముక లాంటివన్నారు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ పరిశ్రమలు ప్రస్తుతం పురోగతిలో ఉండగా మెషిన్ టూల్ రంగం మాత్రం వెనుకంజలో ఉందని వివరించారు. పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నదని.. వాటిని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.
స్మార్ట్ పరికరాల తయారీలో ఐవోటీ కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. వైద్య పరికరాల్లో త్రీడీ ప్రింటింగ్పై తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించనున్న మూడు రోజుల సదస్సుకు 500 మంది ప్రతినిధులు, 150 మంది ఎగ్జిబిటర్లు, 20 వేలకు పైగా సందర్శకులు రానున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో 500కు పైగా యంత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇండోమ్యాచ్ బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్లు సచిన్, సోమ, సుధీర్, మనీష్ సిన్హా, సుమీత్ పర్వాల్ పాల్గొన్నారు.