కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై పలు కంపెనీలు దృష్టి సారించాయి. వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికి కొవిడ్ టాస్క్ పేరుతో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతేకాక కరోనాకు సంబంధించిన సమాచారం, చికిత్స, జాగ్రత్తలపై ప్రతిరోజు ఒపెన్ సెషన్ నిర్వహిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు కొండంత ధీమాతో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో తమ ఆరోగ్యంపై కంపెనీలు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కంపెనీలకు తోడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) సైతం ఐటీ ఉద్యోగుల కోసం అనేక చర్యలు చేపట్టింది. కొవిడ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి కరోనాకు సంబంధించిన అంశాలపై పని చేస్తున్నది.
మొదటి దశతో పోలిస్తే రెండో దశలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇప్పటికే ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం చేస్తున్నా.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మొదటి దశలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయినా రెండో దశలో మాత్రం ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై కంపెనీలు దృష్టి సారించాయి. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా కొవిడ్ టాస్క్ఫోర్స్ పేరుతో నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచి అవసరమైన సేవలు అందిస్తున్నాయి.
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పలు కంపెనీలు ప్రత్యేక చర్యలు చేపట్టి పని చేయించుకుంటున్నాయి. ఒక ఉద్యోగి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న పలు ఐటీ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ ఉన్న కాలాన్ని పెయిడ్ సెలవులుగా గుర్తించి పూర్తి వేతనాన్ని చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం కరోనాపై ప్రతిఒక్కరూ తీవ్ర భయాందోళనలు చెందుతున్న పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు అండగా నిలుస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని ఐటీ ఉద్యోగి గణేశ్ తెలిపారు. మొత్తంగా కంపెనీ చేపట్టిన చర్యలతో ఉద్యోగులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా పని చేయగలుగుతున్నారు.
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ఐటీ కంపెనీలు అనేక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. అంతటితో ఊరుకోకుండా ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం, ఇతర ప్రైవేట్ వైద్యశాలలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) తరుపున ఐటీ ఉద్యోగుల కోసం కొవిడ్ టాస్క్ను ఏర్పాటు చేశాం. మహమ్మారిపై నిరంతరం సూచనలు, సలహాలు అందిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులకు మందులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్, ప్లాస్మా వంటివి అసోసియేషన్ తరుపున అందించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. – సందీప్కుమార్ మక్తల, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్
ప్రతిరోజు నిర్వహిస్తున్న ఓపెన్ సెషన్లో పాల్గొంటున్న డాక్టర్లు ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి సందేహాలు, అపోహలు ఉన్నా వెంటనే తీర్చేస్తున్నారు. కంపెనీలు సైతం ఉద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు కొండంత బలం వస్తున్నది. కరోనా అంటే భయం లేకుండా విధులు నిర్వహించగలుతున్నారు. అంతేగాక కుటుంబ సభ్యులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇదో మంచి చర్య. – టి.కృష్ణ మోహన్, ఐటీ ఉద్యోగి