సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ కారిడార్ అత్యంత కీలకమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఐటీ కారిడార్లోని ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన ఉండేది. అలాంటిది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐటీ రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దాని ఫలితంగానే దేశ సిలికాన్ వ్యాలీగా ఉన్న బెంగళూరును మించిపోయేలా ఇక్కడ ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందుతున్నది. ఐటీ కారిడార్ అంటే కేవలం ఐటీ కంపెనీల కార్యాలయాలే కాదు. పక్క పక్కనే నివాస భవనాలు, ఐటీ కంపెనీల కార్యాలయాలు. వాక్ టు వర్క్స్ అనే భావనతో రూపుదిద్దుకున్న ఐటీ సెజ్లు హైదరాబాద్ అభివృద్ధికి నమూనాలుగా మారాయి.
ఐటీ కారిడార్లో నివాసం ఉంటున్న ప్రజలు ఊహించిన రీతిలో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికలే ప్రధాన కారణం. ఇవే ఇప్పుడు ఐటీ కారిడార్లోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపునకు దోహదం చేసేలా ఉంటున్నాయి. ఇంటింటి ప్రచారం చేస్తున్న పార్టీ అభ్యర్థులకు స్థానికుల నుంచి వస్తున్న సానుకూల స్పందనే ఇందుకు నిదర్శనంగా పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లోని కంపెనీల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల నివాసాలు ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ పనితీరు పట్ల ఐటీ ఉద్యోగులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నగరంలోనే కాకుండా రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణమే ఉండటంతో ప్రజలు గెలుపు ఓటములపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఏ పార్టీ ఏం చేసింది? ఏ అభ్యర్థి ఎలాంటి వారు? సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి ఎలాంటి అభివృద్ధి చేశాడనే అంశాలను బస్తీలు, కాలనీల్లోనే కాకుండా ఐటీ కారిడార్లో అత్యధికంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లోనూ వీటిపైనే చర్చించుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా కేవలం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.9వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ పేర్కొంటున్నారు.
అదే విధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రాంతాలైన నార్సింగి, మణికొండ, కోకాపేట, గండిపేట ప్రాంతాల్లో ఐటీ కంపెనీలతో పాటు నివాస ప్రాంతాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల్లో గత తొమ్మిదిన్నరేండ్లలో గణనీయమైన అభివృద్ధి జరగడం, ఈ ప్రాంత రూపురేఖలు ఒక్కసారిగా మారిపోవడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వ పనితీరు వల్లే ఇదంతా సాధ్యమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు అడగకపోయినా ఐటీ కారిడార్లో పదుల సంఖ్యలో లింకు రోడ్ల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఐటీ కారిడార్లోని నివాస ప్రాంతాల్లోనూ మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వడంతోపాటు వాటిని సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్న వారు చర్చించుకుంటున్నారు. ఇలా రెండు నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి ఊహించని రీతిలో జరగడంతో ప్రభుత్వం పట్ల అత్యంత సానుకూలతను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తేనే మరింతగా అభివృద్ధి జరుగుతుందనే అంశంపైనే కాలనీ సంక్షేమ సంఘాలు తమ అంతర్గత సమావేశాల్లోనూ చర్చించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు.