సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : ఐటీ కారిడార్లో మరో రాచమార్గం రాబోతున్నది. ఇప్పటికే బయో డైవర్సిటీ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, మైండ్ స్పేస్ వద్ద ఫ్లై ఓవర్, అండర్ పాస్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45, అయ్యప్ప సొసైటీ వద్ద అండర్ పాస్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఐటీ కారిడార్కు రాచబాట వేశారు. ఇందులో భాగంగానే షేక్పేట సెవన్ టూంబ్స్ నుంచి షేక్పేట ఓయూ కాలనీ జంక్షన్ మీదుగా రాయదుర్గం విస్పర్ వ్యాలీ వరకు 2.8కిలోమీటర్ల మేర రూ. 333.55కోట్లతో చేపడుతున్న ఆరు లేన్ల ఫ్లై ఓవర్ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పిల్లర్లు, పిల్లర్లపై పియర్ క్యాప్స్ (గడ్డర్స్), స్లాబ్ నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఒకచోట స్లాబ్ వర్క్తో పాటు ర్యాంపుల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 95 శాతం పనులు పూర్తయ్యాయని, వర్షాల కారణంగా కొంత జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నిర్దేశిత లక్ష్యం ఖరారు చేయగా, నవంబర్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.
మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు ఉన్న ఇన్నర్ రింగు రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఆదేవిధంగా ఐటీ కారిడార్కు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ఈ రహదారిలో ఫ్లై ఓవర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఫ్లై ఓవర్తో హైటెక్ సిటీ , గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాలకు వెళ్లే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు సాఫీగా ప్రయాణం చేయవచ్చు. ఉద్యోగుల సమయాన్ని, ఇంధనాన్ని వృథా చేయకుండా ఈ మార్గం దోహదం చేస్తుంది. షేక్పేట సెవన్ టూంబ్స్ జంక్షన్ సమీపంలో ప్రారంభమై విస్పర్ వ్యాలీ (రాయదుర్గం జంక్షన్) వరకు పలు చోట్ల వివిధ మతపరమైన కట్టడాలు ఉండటంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని విశాలంగా ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు. ఇందుకోసం మొదట సర్వీస్ రోడ్ను నిర్మించి ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఫ్లై ఓవర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్కు వెళ్లే వారికి భారీ ఉపశమనం లభిస్తుంది.
ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం – రూ.333.55 కోట్లు
7 టూంబ్స్ నుంచి రాయదుర్గం జంక్షన్ వరకు 2.8 కిలోమీటర్లు
ఆరు లేన్ల (24 మీటర్లు)తో ఫ్లై ఓవర్
మొత్తం 74 పిల్లర్లు… అన్నీ పూర్తి
పిల్లర్లపై 72 గడ్డర్లు.. అన్నీ ఏర్పాటు
440 పీఎస్సీ గడ్డర్లకు 440 పూర్తి
73 చోట్ల స్లాబ్లు.. 70 చోట్ల పూర్తి, పురోగతిలో మరో 3
దాదాపు 95 శాతం మేర నిర్మాణ పనులు పూర్తి