సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో గత 24 ఏండ్లుగా చేసిన సేవలను గుర్తిస్తూ 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్కు చెందిన ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ మామిళ్ల శ్రీధర్రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ను ప్రకటించింది. 1998 బ్యాచ్కు చెందిన శ్రీధర్ ఎస్సైగా 2000లో పోలీసు శాఖలో అడుగుపెట్టారు. 2010లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన తర్వాత నల్గొండ జిల్లాలో పని చేశారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి దేశం తరఫున ఎంపికై 2016-17లో లాటిన్ అమెరికాలోని హైతీలో పోలీస్ ఆపరేషన్స్ ప్లానింగ్ అధికారిగా పనిచేశారు. తిరిగి వచ్చిన తర్వాత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్నగర్ డీఐగా పనిచేశారు. కరుడుగట్టిన దొంగల ముఠాలను అరెస్ట్ చేసి, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.
రాచకొండ కమిషనరేట్ ఏర్పాటైన తర్వాత 2018లో ఐటీ సెల్ హెడ్గా, ఇన్స్పెక్టర్ శ్రీధర్ను నియమించారు. రాచకొండ కమిషనరేట్లో క్షేత్ర స్థాయి నుంచి ఐటీ విభాగాన్ని అభివృద్ధి చేసి, సీసీటీవీ కెమెరాలను పెంచడం, సోషల్మీడియా విభాగాన్ని విస్తృత పరచడం, ఐటీలో పోలీసు అధికారులకు శిక్షణ, సీసీటీఎన్ ద్వారా రికార్డుల కంప్యూటరీకరణ, డయల్ 100 పనితీరును మెరుగు పరిచి వేగంగా ప్రజలకు సేవలందించేలా చేయడంలో తనదైన శైలిలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. టెక్నాలజీని వాడటంలో, దర్యాప్తు బృందాలకు సాంకేతిక సపోర్టు ఇస్తూ సంచలనాత్మకమైన కేసుల దర్యాప్తులో తనవంతు సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. 2015లో పంజాబ్లో జరిగిన అఖిల భారత స్థాయి డ్యూటీ మీట్లో ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో రజత పతకాన్ని సాధించారు. విధి నిర్వహణలో చూపించిన ధైర్య సాహసాలు, ప్రతిభకు 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శౌర్య పతకం, 2019లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాన్ని ఇచ్చి శ్రీధర్ సేవలకు గుర్తింపునిచ్చింది. ప్రతిష్టాత్మక భారత పోలీస్ పతకాన్ని పొందిన ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డిని డీజీపీ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ అభినందించారు.