బల్దియా పరిధిలో ప్రజల అవసరాలకు కేటాయించిన నిధులను కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు ఉద్దేశించిన ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ వ్యవస్థను అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మార్చారు. ఎమర్జెన్సీ అన్న పదాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలను తుంగలో తొక్కి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పన్నంగా దోచుకుంటున్నారు. నామమాత్రం పనులతో ప్యాచ్వర్క్లో నాణ్యత లోపిస్తున్నదనే విమర్శలున్నాయి. పర్యవేక్షణ చేపట్టాల్సిన అధికారులు వాటిపై దృష్టిసారించడం లేదు.
సిటీబ్యూరో : ట్రై కార్పొరేషన్ పరిధిలోని 60 సర్కిళ్లకు గానూ ఐఆర్టీ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదాహరణకు ఒక్క ఉప్పల్ సర్కిల్ పనులను పరిశీలిస్తే ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో ఉప్పల్, చిలుకానగర్, బీరప్పగడ్డ, హబ్సిగూడ, వెంకట్రెడ్డినగర్, రామంతాపూర్ డివిజన్లు ఉన్నాయి. అయితే వీటికి ఐఆర్టీ పనుల కోసం నిధులు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం టెండర్ల పనుల్లో కూడా 30 శాతానికి పైగా లెస్కు వెళ్లి మరీ ఈ టెండర్లు దక్కించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో వార్డులో ఒక ట్రాక్టర్, ఇద్దరు మనుషులు విధులు నిర్వర్తిస్తారు. రెండు నెలల కాలపరిమితి కోసం ఒక్కో వార్డుకు రూ.5 లక్షల నిధులు కేటాయించారు. అయితే ఏప్రిల్ నెల ముగుస్తున్నప్పటికీ వార్డుకు ఒక ట్రాక్టర్ను పెట్టాల్సిన కాంట్రాక్టర్లు కొన్నిచోట్ల రెండు వార్డులకు కలిపి ఒకే ట్రాక్టర్తో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు వాటిని పట్టించుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
అందుబాటులో లేని వాహనాలు..
వార్డులలో ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండాల్సిన వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. ఫిర్యాదుల ఆధారంగా ప్యాచ్ వర్క్లు చేపట్టాల్సి ఉంటుంది. ఒక వాహనం మధ్యాహ్నం 12 గంటలైనా మున్సిపాలిటీలోనే పార్క్ చేసి ఉంటుంది. ప్రతి రోజు పర్యవేక్షణ లేకపోవడం, వాహనాలు ఎక్కడ ఉన్నాయో తనిఖీలు చేయకపోవడంతో పనులు ప్రశ్నార్థ్ధకమవుతున్నాయి. వాహనాలకు డివిజన్ల పేర్లతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం కొన్ని డివిజన్ల వాహనాలు కనిపించవు. ముందుగానే ఏ డివిజన్లో ఏ వాహనం, వాటి నంబర్లు, సిబ్బంది పేర్లు నమోదు చేసుకోవాల్సిన అధికారులు వాటిపై దృష్టిసారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..!
ప్యాచ్ వర్క్లు చేస్తున్నప్పడు పరిశీలించి, సిమెంట్, ఇసుక, ప్యాచ్లను పరిశీలించాల్సిన సూపర్వైజర్లు, అధికారులు అందుబాటులో ఉండటం లేదు. ఇదే అదునుగా కొందరు కాంట్రాక్టర్లు నామమాత్రపు సిమెం ట్, ఇసుకతో నాణ్యతలేని పనులు చేపడుతున్నారు. గూగూల్ లొకేషన్ ఫొటోలు తీయ డం, ఉన్నతాధికారులకు పంపించడంతో పని పూర్తిచేసినట్లు భావిస్తున్నారు. ఉప్పల్ సర్కిల్లో మాత్రం 6 వాహనాలకు 4 వాహనాలే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. అధికారులకు సమాచారం అడిగితే తెలుసుకుంటాము… అని చెప్పడం గమనార్హం. పూర్తిస్థాయిలో వాహనాలు, వాటి నంబర్లు, సిబ్బందిని పరిశీలించాకే పనులు ప్రారంభించాల్సిన అధికారులు, వాటిపై దృష్టిసారించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లక్షల్లో నిధులు కేటాయించినా.. పనుల్లో పారదర్శకత లేకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడంలేదు. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్లలో మాత్రమే వాహనాలు కనిపిస్తున్నాయని.. మిగితా ప్రాంతాల్లో అస్సులు ప్యాచ్ వర్క్లు చేపట్టడంలేదనే విమర్శలున్నాయి. అయితే బిల్లులు చెల్లించేటప్పుడు అధికారులు ఎలా బిల్లులు చేస్తారో వేచిచూడాలి. గత రెండేళ్లుగా ఇదే తరహాలో పనులు చేయకపోయినా, తక్కువ మంది, వాహనాలతో పనిచేయించి కాంట్రాక్టర్లతో కలిసి ఎక్కువ మొత్తంలో నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు అవసరమైన చోట ఐఆర్టీ పనులు చేపట్టడంతో పాటు.. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.