జీడిమెట్ల, డిసెంబర్ 11: చింతల్ డివిజన్ పరిధి భగత్సింగ్నగర్ కాలనీలో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగత్సింగ్నగర్ కాలనీలో రూ.45లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టిన తరువాత రోడ్లపైన ఘన వ్యర్థాలను వదిలేయడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నాణ్యతా లోపంతో పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానిక బస్తీ వాసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించి, ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని భగత్సింగ్నగర్ కాలనీవాసులు కోరుతున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు..
భగత్సింగ్నగర్ కాలనీలో చేపడుతున్న భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనుల విషయమై జీహెచ్ఎంసీ ఏఈ సంతప్కుమార్ను వివరణ కోరగా.. సంబంధిత కాంట్రాక్టర్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయిన తరువాత వ్యర్థాలను తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.