గ్రేటర్ హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు టోల్ టెండర్ ప్రక్రియ పూర్తయింది. పారదర్శకంగా పూర్తయిన టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) ప్రాతిపదికన పిలిచిన టెండరు ప్రక్రియలో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పోటీపడ్డాయి. అన్ని రకాల పరిశీలనల తర్వాత రూ.7,380 కోట్లకు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి ఈ టెండర్ను ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ఔటర్ రింగు రోడ్డుపై 30 సంవత్సరాల పాటు టోల్ను వసూలు చేయడంతో పాటు ఓఆర్ఆర్ నిర్వహణను ఐఆర్బీ ఇన్ఫ్రా చేపట్టనుంది. కాగా ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయనుంది.
గ్రేటర్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్ దీర్ఘకాలిక కాంట్రాక్టు కోసం హెచ్ఎండీఏ టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన టెండర్లు పిలిచింది. గత ఏడాది నవంబర్ 9వ తేదీన హెచ్ఎండీఏ 30 సంవత్సరాల లీజు వ్యవధితో అవుటర్ టోల్, నిర్వహణకు అంతర్జాతీయస్థాయి బిడ్లను ఆహ్వానించగా… పదకొండు కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో టెండర్ గడువు ముగిసే నాటికి బరిలో మొత్తం 11 కంపెనీలు ప్రాతినిధ్యం వహించాయి. కాగా రెండు దశల్లో జరిగిన సుదీర్ఘ బిడ్డింగ్ ప్రక్రియలో నాలుగు కంపెనీలు సాంకేతికంగా అర్హత సాధించాయి. ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, దినేశ్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అర్హత సాధించినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. అనంతరం ప్రైస్ బిడ్ల పరిశీలన అనంతరం ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి రూ.7,380 కోట్లకు టీవోటీ విధానంలో టెండర్ను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ…
ఔటర్కు టీవోటీ విధానంలో చేపట్టిన టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. బిడ్ల దాఖలుకు ఏకంగా 142 రోజుల సమయాన్ని ఇవ్వడమే కాకుండా రెండు పర్యాయాలు ప్రీబిడ్ సమావేశాలను కూడా నిర్వహించింది. ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు.
ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా..
జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2016లోనే టీవోటీ విధానానికి అనుమతిచ్చింది. అప్పటి నుంచి జాతీయ రహదారుల సంస్థ టోల్ నిర్వహణ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నది. ఇప్పటివరకు ఆరు చోట్ల దాదాపు 1600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను టీవోటీ విధానంలో అప్పగించి ఆర్థిక వనరులను సమకూర్చుకుంది. 15నుంచి 30 సంవత్సరాల లీజు వ్యవధి ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులను అప్పగించారు.
దేశంలో ఇది రెండో అతి పెద్ద టీవోటీ ప్రాజెక్టు..
తమ కంపెనీ చేపట్టిన టీవోటీ ప్రాజెక్టుల్లో హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు అనేది ముంబై -పుణె ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు తర్వాత దేశంలోనే రెండో అతి పెద్ద ప్రాజెక్టు అని ఐఆర్బీ ఇన్ఫ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు ఔటర్ టీవోటీ దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా గురువారం తన స్పందన వెలువరించింది. తమ కంపెనీ ఇప్పటికే దేశంలోని పది రాష్ర్టాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, తాజా టీవోటీ ప్రాజెక్టుతో తెలంగాణలోనూ ప్రవేశించి పదకొండు రాష్ర్టాల్లో విస్తరించిందని ఐఆర్బీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్ర దత్తాత్రేయ మైస్కర్ పేర్కొన్నారు.
పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు : సీఎం కేసీఆర్
అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగిన బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ లావాదేవీతో ఓఆర్ఆర్ వెంబడి మరిన్ని పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఏర్పడుతాయన్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయని తెలిపారు. అలాగే మౌలిక వసతులను మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ విధానాలు, హైదరాబాద్ అభివృద్ధిపై పెట్టుబడిదారులకు కలిగిన నమ్మకంతోనే ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
లాభదాయకమైన పెట్టుబడులకు ఇదో నిదర్శనం : మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో లాభదాయకమైన పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలున్నట్లు ఔటర్ టీవోటీ టెండర్ల ప్రక్రియ రుజువు చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ బిడ్డింగ్ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ బిడ్డింగ్ ప్రక్రియతో రాష్ర్టానికి ఉన్న పారిశ్రామిక అభివృద్ధి సత్తా మరోసారి తెలిసిందన్నారు. పారదర్శక పారిశ్రామిక విధానాలతో వాణిజ్య రంగంలో తెలంగాణ దూసుకెళ్తున్నదని, అంతర్జాతీయ సంస్థల వ్యాపార సామ్రాజ్య విస్తరణకు తెలంగాణ ప్రధాన వేదికగా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.