బంజారాహిల్స్ : మద్యం మత్తులో అకారణంగా ఇద్దరిపై దాడికి దిగిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న మధుసూధన్ రావు అనే వ్యక్తి తన స్నేహితులు భరత్, ప్రవీణ్లతో కలిసి ఈ నెల 7న శ్రీనగర్కాలనీలోని మధుశాల బార్కు వచ్చారు.
విందు ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో వారిని తాబేలు..అంటూ ఎల్ఎన్నగర్కు చెందిన చిక్కి, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు హేళనగా మాట్లాడారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మధుసూధన్తో పాటు భరత్ మీద పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో భరత్ మెడలోని బంగారు గొలుసు తెగిపోయింది.
బార్నుంచి బయటకు వచ్చిన తరవాత కూడా మరికొంతమంది స్నేహితులను పిలిచిన చిక్కీ, పవన్లు మరోసారి దాడి చేయడంతో పాటు బయటకు వెళ్లకుండా అడ్డగించారు. ఈ దాడిలో గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై ఐపీసీ 341, 323, 506 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.