వెంగళరావునగర్, నవంబర్ 30 : ఉల్లాసంగా.. ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గడిపారు. వెంగళరావునగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో బుధవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి 13 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దీక్షా దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలకు కబడ్డీ, ఖోఖో, క్యారమ్, చెస్, షెటిల్ తదితర పోటీలు నిర్వహించారు.
పిల్లలు, పెద్దలు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో ఎమ్మెల్యే మాగంటి పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ కుటుంబానికి కార్యకర్తలు దూరమవుతున్నామనే వెలితిని తీర్చాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నా.. పార్టీ సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభలకు జన సమీకరణ, బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమని పేర్కొన్నారు. నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు పార్టీ ధ్యాసలోనే కార్యకర్తలు గడుపుతున్నారని అన్నారు.
పార్టీ పనుల్లో నిమగ్నమైన కార్యకర్తలకు వారి కుటుంబాల నుంచి కావాల్సినంత మద్దతు లభిస్తున్నదని తెలిపారు. పార్టీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులతో ఆటలు ఆడి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్యామ్ ముదిరాజ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అజయ్కుమార్, జీటీఎస్ దేవాలయ చైర్మన్ చిన్న రమేశ్, రామాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ నాగం సుజాత, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణు, వెంగళ్రావునగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్, పవన్ ముదిరాజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటిన వారికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ బహుమతులను ప్రదానం చేశారు.