సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18,432 మంది సిబ్బంది పనిచేస్తుండగా అందులో 11.5 శాతం మంది మహిళా సిబ్బంది ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఒక పక్క ఉద్యోగంలో అధికారిగా, మరో పక్క తల్లిగా, భార్యగా సమాజంలో మహిళలు బహుపాత్రలు నిర్వహించాల్సి ఉన్నా, ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గురువారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అడిటోరియంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డు నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న 117మంది మహిళా సిబ్బందిని సీపీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలలో ఫీల్డ్ పాత్రలు చేపట్టాలని సూచించారు. సీసీఎస్, ఎస్బీ, సీఐడీ, ఇంటలిజెన్స్ వంటి వాటిలో పోస్టింగ్లకు ప్రాధాన్యత ఇస్తూ, కఠినమైన విధులకు దూరంగా ఉండకూడదని సూచించారు.
174 ఏండ్ల హైదరాబాద్ సిటీ పోలీస్ చరిత్రలో మొదటి మహిళా ఎస్హెచ్ఓగా మధులత గత ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్హెచ్ఓలుగా బాధ్యతలు చేపట్టేందుకు చాలా తక్కువ మంది మహిళా అధికారులు ముందుకు వచ్చారని, ఇందులో ఇద్దరు మహిళా ఎస్హెచ్ఓలు ధనలక్ష్మి, జ్యోత్స్నలు మాత్రమే ఉన్నారన్నారు. 2020 బ్యాచ్కు చెందిన తాజా మహిళా ఎస్ఐలు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ నుంచి ఇతర విభాగాలలోకి డిప్యుటేషన్ల కోసం అభ్యర్థిస్తూ తన కార్యాలయానికి క్యూ కడుతున్నారని ఎత్తి చూపారు.
లింగ అసమానత, వివక్ష వంటి అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తూ, సంప్రదాయ ఆలోచనలను మార్చుకోవాలని సీపీ సూచించారు. మహిళా సహాద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలోచన ధోరణి మార్చుకోవాలని పురుష అధికారులకు సీపీ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ(అడ్మిన్) పరిమళ హననూతన్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ డీసీపీ సునీతారెడ్డి, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, గజారావు భూపాల్, తదితర అధికారులు పాల్గొన్నారు.