సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు విడతలలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 114 కేంద్రాలు, రెండవ విడతలో 43 కేంద్రాలు, మూడో విడతలో 40 పరీక్షా కేంద్రాలలో పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 36,243 మంది సైన్స్ విద్యార్థులు, 24,242 మంది ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు.
నాలుగు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు 106 ప్రైవేటు కళాశాలలకు డిపార్టెంటల్ ఆఫీసర్స్ను నియమించారు. విద్యార్థులు నిర్దేశిత టైం టేబుల్ ప్రకారంగా పరీక్షలకు హాజరుకావాలని, హాల్ టికెట్స్పై సంబంధిత ప్రిన్సిపాల్ సంతకం లేకున్నప్పటికీ పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించాలని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.ఒడ్డెన్న తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు.