సిటీబ్యూరో, మే 7(నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి మూడు జిల్లాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు శనివారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండియర్ సెకండ్ లాంగ్వేజీ (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఫ్రెంచ్) పరీక్షలకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో 96.30 శాతం విద్యార్థుల హాజరు నమోదైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఓదెన్న తెలిపారు. కేవలం 3.70 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదన్నారు. మొత్తం సెకండియర్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 69,357 మంది నమోదు చేసుకోగా వారిలో 66,740 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే జిల్లాలో మొత్తం 234 పరీక్ష కేంద్రాలు ఉండగా..వాటిలో ఒక పరీక్ష కేంద్రంలో ఒక మాల్ ప్రాక్టీస్ కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్లో 97.70 శాతం, రంగారెడ్డి జిల్లాలో 96.79 శాతం హాజరుయ్యారు.
ఇంటర్ పరీక్షలు రాసిన వీణావాణీలు
వెంగళరావునగర్, మే 7: అవిభక్త కవలలైన వీణా వాణీలు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ బోర్డు అధికారులు ఆసిఫ్నగర్లోని ప్రియాం క బాలికల జూనియర్ కళాశాలలో వీరికి పరీక్షా కేం ద్రాన్ని కేటాయించారు. తలలు అతుక్కొని ఉన్న అవిభక్త కవలలకు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులకు లేఖ రాసినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వర్ రావు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఇంటర్ బోర్డు ఈ కవలలిద్దరికీ యూసుఫ్గూడ స్టేట్ హోం ఆవరణలో ఉన్న బాల సదన్లో పరీక్షా కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. స్వయంగా వారే పరీక్షలు రాశారు.