సిటీబ్యూరో, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో… వినూత్న ఆవిష్కరణలతోనే వాటి నియంత్రణ సులభతరం అవుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో జరిగిన రెండ్రోజుల హెల్త్ హ్యాక్స్ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సీసీఎంబీ, సీడీఎఫ్డీకి డైరెక్టర్లు డాక్టర్లు వినయ్కుమార్ నందికూరి, తంగరాజన్ హాజరై ప్రారంభించారు. ఏఐసీలోని ఇన్నోవేటర్లు ప్రాజెక్టులను ప్రదర్శించగా లైఫ్ సైన్సెస్ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలపై చర్చించారు.
అనంతరం యంగ్ ఇన్నోవేటర్లకు మార్కెట్లోని డిమాండ్పై అవగాహన కల్పించేలా మెంటరింగ్ సమావేశాలు నిర్వహించారు. కాగా పలువురు మెంటార్లు, బయోలాజికల్ నిపుణులతోపాటు, యంగ్ ఇన్నోవేటర్లు ఆవిష్కరణలను ప్రదర్శించారు. వివోఫీట్ అనే స్టార్టప్ కాళ్లకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల నియంత్రణకు రూపొందించిన ఏఐ ఆధారిత సాక్సులను పీపీటీ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసిన నిర్వాహకులు అవార్డులను అందజేశారు.