సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్వోటీ కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజు ఛాతిలో ఎడమవైపు రెండు బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని కూకట్పల్లి రామ్దేవ్ హాస్పిటల్ నుంచి మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజుకు వెంటిలెటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే, అతడి పరిస్థితి 24 గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.
నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దారి దోపిడి, హత్యకు సంబంధించిన కేసులో నిందితులను పట్టుకునేందుకు ఎస్వోటీ బృందం జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని సిక్ కాలనీకి వెళ్లింది. అక్కడ తలదాచుకున్న దుండగులను పట్టుకునేందుకు కానిస్టేబుళ్లు రాజు, వినయ్ వెళ్లగా.. దుండగుడు కరణ్సింగ్తో పాటు మరో దుండగుడు కలిసి ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తులతో డాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న రామ్దేవ్ హాస్పిటల్కు తరలించగా.. రాజు ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గ్రీన్చానల్ ఏర్పాటు చేసి మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు.
ఆరోగ్య పరిస్థితిపై ఆరా..
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రాజు నాయక్ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం మెడికవర్ హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. రాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. దోపిడీ, దొంగతనం కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులపై దుండగులు కరణ్సింగ్తో పాటు మరో దుండగుడు కలిసి దాడి చేసినట్లు వివరించారు. దాడిలో గాయపడిన రాజుకు చికిత్స అందుతున్నదని సీపీ తెలిపారు. దాడికి పాల్పడిన కరణ్సింగ్పై గతంలో కూడా నాలుగు కేసులు ఉన్నట్లు సీపీ వివరించారు.