పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ
అమాంతం పెరిగిన రేట్లు.. బీజేపీ పాలనలో ధరల దరువు
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తేతెలంగాణ) : పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేంద్రం తాజాగా పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం నుంచి 18 శాతం వరకు జీఎస్టీ విధించింది. ఈనెల 18 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీతో వంటింట్లో మరింత ధరల భారం పెరిగింది.
వంటనూనెలు, పప్పుదినుసులు, కూరగాయలు ఇలా అన్ని వస్తువుల ధరలు పెరిగి భారంగా బతుకీడిస్తున్న కుటుంబాలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన జీఎస్టీతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలోనే గ్యాస్ సిలిండర్పై రూ.50 పెరగడంతో ఆందోళనలో ఉన్న గృహిణులు, పదిరోజులు గడవకముందే జీఎస్టీని విధించింది. పెరిగిన ధరలతో కొనేదెలా..? తినేదెట్లా? అని పేదలు, మధ్యతరగతి వారు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. సంపన్నులకు మేలు చేస్తూ సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జీఎస్టీని తగ్గించాలి
కేంద్రం తాజాగా విధించిన జీఎస్టీని వెంటనే తగ్గించాలి. బజారుకెళ్లి ఏం కొనాలన్న భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదు. – రేణుక, గృహిణి
కార్పొరేట్లకే వత్తాసు
కేంద్రంలో ఉన్న సర్కారు కార్పొరేట్లకు దాసోహమయ్యింది. బీజేపీ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తోంది. పేదల బతుకు మరింత ఛిద్రమవుతోంది.
– రేణుక, గృహిణి, తుకారాంగేట్
ప్రతిదానిపై పన్నులా?
కొనేవాటి నుంచి తినేవరకు ప్రతిదానిపై పన్నులు వేస్తే ఎలా బతకాలి. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. నిత్యావసరాలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దుచేయాలి.
– నాగమణి, శాంతినగర్
ఆర్థికంగా కుంగదీస్తుండ్రు..
కేంద్రం పన్నుల మీద పన్నులు వేస్తూ ఆర్థికంగా కుంగదీస్తుండ్రు. గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అన్యాయం. వెంటనే జీఎస్టీని రద్దు చేయాలి.
– పద్మ, శ్రీరామకాలనీ
కొనేటట్లు.. తినేటట్లు లేదు
కేంద్రం విధిస్తున్న పన్నులతో ఏం కొనేటట్లు..తినేటట్లులేదు. ఏ వస్తువు కొందామన్న మండిపోతోంది. చిరువ్యాపారులను ముంచి, బడావ్యాపారులకు మేలు చేసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. పేదల ఓట్లతో గద్దెనెక్కిన కేంద్రం ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.
– రఘుపతి, పాలరైతు, కోళ్లపడకల్
జీఎస్టీ తగ్గించాలి..
కేంద్ర సర్కారు ఇష్టానుసారం నిత్యావసర వస్తువులపై పన్నులు విధించడంతో పేద,మధ్యతరగతి వారు బతికే పరిస్థితి లేకుండా ఉన్నది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని వెంటనే తగ్గించాలి.
– నాగజ్యోతి,లాల్బజార్
పన్ను దారుణం..
ప్రతి వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారు. పాలు, పెరుగుపై కూడా విధించడం చాలా దారుణం. సామాన్యులు బతికేదెట్ల? ఇప్పటికే గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. – స్వరూప, తిరుమలగిరి
ఉపసంహరించుకోవాలి
బీజేపీ పాలనలో పేదల జీవితం అగమ్యగోచరమైంది. పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులపై జీఎస్టీ విధింపుతో ధరలు పెరిగాయి. సామాన్య ప్రజలపై భారం పడుతోంది.
– ఎడ్ల రాంరెడ్డి, ఆకులమైలారం
బీజేపీ పతనం ఖాయం
పాలు, దాని అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు అన్యాయం. ధరల భారం మోపువుతున్న బీజేపీ సర్కారు పతనం ప్రారంభమైంది. పని చేసుకొని బతికేటోళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
– బొక్క దీక్షిత్రెడ్డి, కొత్తగూడ, కందుకూరు
ఎంతకాలం మోతల భారం?
పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలను కేంద్రం పూర్తిగా మరిచిపోయింది. లోటును పూడ్చుకునేందుకు పేదలపై భారం మోపడం అసమంజసం. నిరుపేదల కష్టాలు తీర్చడంలో పెద్దన్న పాత్ర వహించాల్సింది పోయి..కష్టాల్లోకి నెట్టడం అత్యంత బాధాకరం. – మల్లంపల్లి విమల, గృహిణి
అచ్చేదిన్ కాదు..సచ్చేదిన్
కేంద్రంలోని బీజేపీ అసమర్థ పాలన వల్ల ప్రజలకు అచ్చేదిన్ రాలేదు. ధరల పెరుగుదలతో సచ్చేదిన్ వచ్చింది. పేదలకు మంచి చేస్తామని గద్దెనెక్కిన పాలకులు పాలు, పెరుగు, పప్పులు, నూనె లాంటి వస్తువులపై జీఎస్టీ వేస్తూ దోచుకుంటుంది. ప్రజల రాబడి పెరగలేదు..ఖర్చులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి.
– దివ్య, కేపీహెచ్బీకాలనీ
పాలు, పెరుగుపై పన్నులా ?
నిత్యం వినియోగించే పాలు, పెరుగుపై పన్నులేయడం బాధాకరం. మంచి రోజులొస్తాయని నమ్మించి గద్దెనెక్కిన బీజేపీ సర్కారు ఎవరికి మంచి చేస్తుందో అర్థం కావడం లేదు. కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదు.
– రాజ్యలక్ష్మి, కూకట్పల్లి