Hyderabad | జవహర్నగర్, ఫిబ్రవరి 11: పేదల ఇళ్ళపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెల్లో బ్రతుకుతున్న.. ఆడబిడ్డలతో క్రిమికిటాలతో కాలం వెళ్ళదీస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలాంటి పేదలనే టార్గెట్ చేస్తోంది. సారూ! మాకు సమయం ఇవ్వండి. ఖాళీ చేస్తామంటూ అధికారులను వేడుకున్నా తమకు పట్టనట్టు కర్కశంగా ప్రవర్తించారు.
గుడిసెలోని వస్తువులను సిబ్బందితో బయటకు తీసి రోడ్డునా పడేసి ప్రభుత్వం దిక్కులేని వారిని చేసిందంటూ బాధితులు దుమ్మెత్తి పోశారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని పలు అక్రమ కట్టడాలలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పోలీస్ సిబ్బంది సాయంతో మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని దేవేందర్నగర్లో గుడిసెలు వేసుకుని కొన్నేండ్ల నుంచి జీవనం సాగిస్తున్న గుడిసెలపై బుల్డోజర్తో గుడిసెలను నేలమట్టం చేశారు.
మేమేం పాపం చేశాం… ఐదుసార్లు కూలగొట్టారు. ఒకే ఇంటిని ఐదు సార్లు కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. మేమేం పాపం చేశాం.. మా ఇంటిని ఐదు సార్లు కులగొట్టడం ఏంటని పేదలు కన్నెర్ర చేశారు. రెవెన్యూ యంత్రాంగం మా ఇండ్లపై పగ బట్టింది. జవహర్నగర్లో నివసించేది పేదలేనని, కూలికి వెళ్ళితేనే కడుపు నిండుతదని.., రేకులు వేసుకుని జీవనం సాగిస్తున్నామని… ఇంటికి కరెంట్ మీటర్, ట్యాక్సీ ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రశ్నించారు.
జవహర్నగర్లో గరీబోళ్ళే బతుకుతారని, కాంగ్రెస్ వస్తే మాలాంటి పేదల బతుకులు మారుతాయని ఆశపడ్డం.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మాలాంటి పేదల బతుకుల్లో మట్టిని కొడతారని ఊహించలేదని పేదలు కన్నీరు పెట్టుకున్నారు. పేదలు బాగుంటేనే ప్రభుత్వం ఎల్లకాలం సాగుతుందని, పేదలపై ప్రతాపం చూపిన ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని శాపనార్థాలు పెట్టారు.
పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయంలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, పలుకుబడి ఉన్నోళ్ళు బహుళ అంతస్తులు కడుతున్నా వారి ఇళ్ళను కూల్చకపోవడంలో ఆంతర్యమేమిటి? అంటూ పేదలు పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. పేదల గుడిసెలను బుల్డోజర్తో కూలగొడుతున్నారు. కానీ, పలుకుబడి ఉన్నోళ్ళ అక్రమ కట్టడాల వద్ద హంగామా చేస్తూ అధికారులు కాలం వెళ్ళదీశారే.. తప్పితే, పెద్దోళ్ల ఇళ్ళను ముట్టుకోలేదని, ఇదెక్కడి న్యాయం? అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ సీఐ సైదయ్య, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీరేంద్ర సాయి, రమేశ్, టీపీవో శ్రవంతి, రెవెన్యూ సిబ్బంది రవి, సాయి, కాశీరాం, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.