బంజారాహిల్స్, జూలై 26 : జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లోని అంబేద్కర్నగర్ బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సందర్శన కోసం కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని తెలియడంతో బుధవారం బస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు ప్రభుత్వం తాము నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇండ్ల నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించిందని, త్వరలోనే జీవో 58 కింద క్రమబద్ధీకరణ చేయించాలని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రయత్నిస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన అంటూ కాంగ్రెస్ పార్టీనేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో బస్తీవాసులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ వందలాదిమంది బస్తీవాసులు కాంగ్రెస్ నాయకుల రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఏడాది క్రితం కొంతమంది నిర్వాకంతో తమ ఇండ్లను కూల్చేందుకు అధికారులు వచ్చారని, స్థానిక ఎమ్మెల్యే చొరవతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ సొంతింటి స్థలం దక్కిందని, మరోసారి రాజకీయాలు చేస్తూ రోడ్డున పడేయొద్దంటూ స్థానిక బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీవాసుల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన కోసం బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్భందం చేశారు.