సిటీబ్యూరో, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ) : కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా.. చిన్న పిల్లలు వాడే సబ్బుల నుంచి మొదలుకొని తాగే పాల వరకు కలుషితం చేసి కాలకూట విషంగా మారుస్తున్నారు. ఆహార కల్తీ నియంత్రణకు కఠినమైన చట్టాలే ఉన్నప్పటికీ.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా జనాల చెంతకు కల్తీ పదార్థాలు చేరుతున్నాయి. అదేవిధంగా కల్తీ వస్తువులు, పదార్థాల తయారీలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో నివేదిక చెబుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే విస్తృతమైన అవగాహన కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆహార నిపుణులు, వైద్యులు, న్యాయవాదులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ఎం.పద్మనాభ రెడ్డితోపాటు పలువురు నిపుణులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఆహార కల్తీ పెద్ద ఎత్తున జరుగుతున్నది. అత్యాశతో వ్యాపారం చేస్తూ ఆహార పదార్థాలను కలుషితం చేసి జనాలకు స్లో పాయిజన్లా ఎక్కిస్తున్నారు. రసాయనాలు పంటలను కూడా పాడుచేస్తున్నారు. ప్యాకింగ్ మెటీరియల్తోనూ కల్తీ జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. జీర్ణకోశం పాడైపోవడం, చూపు మందగించడం, కీళ్ల నొప్పులు, క్యాన్సర్, గుండెపోటు, పక్షపాతం వంటి రోగాలతో మృతిచెందుతున్నారు. అయినా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపార నిర్వహకులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయని నిపుణులు ప్రశ్నించారు.
ఆహార పంటల ఉత్పత్తి, ప్యాకింగ్ మెటీరియల్, ఇథసాన్, ఇథరల్, కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను పండ్లు, కూరగాయాల్లో వినియోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 2006లో ఫుడ్ సేప్టీ, స్టాండర్ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ.. శిక్షలు కఠినంగా లేకపోవడంతో నిర్విరామంగా కల్తీ వ్యవహారాలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా మిస్ బ్రాండెడ్, సబ్ స్టాండర్డ్ వస్తువుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటితో తీవ్రమైన అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.
బిర్యానీ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ కేంద్రంగా కల్తీ ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో నివేదిక ప్రకారం హైదరాబాద్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. గ్రేటర్లో కల్తీని నియంత్రించేలా 30మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేస్తున్నప్పటికీ కేసులు మాత్రం గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా రోడ్డు పక్కన నడిపించే ఫుడ్ కోర్టు నుంచి మొదలుపెట్టి స్టార్ హోటళ్ల వరకు నాసిరకం పదార్థాలను వినియోగిస్తున్నట్లుగా పలు తనిఖీల్లో వెల్లడైంది. అయినా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నది. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడి పట్టుబడితే జీవిత ఖైదు విధించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. బడా రెస్టారెంట్లు, హోటళ్లు కూడా కల్తీ పదార్థాలతో ఆహారాన్ని జనాలకు వడ్డిస్తున్నాయి.
ఆహార పదార్థాలను కల్తీ చేయడం వలన ప్రాణాలు పోతున్నాయి. నిజానికి వ్యాపారులు చేసే అక్రమాలపై అవగాహన లేకపోవడంతోనే కొనుగోలుదారులు నష్టపోతున్నారు. దీర్ఘకాలం పాటు కల్తీ పదార్థాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడంతో ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. పదేళ్లు నిండని చిన్నారులు భయంకరమైన వ్యాధులతో పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఆహార పదార్థాల కల్తీపై అవగాహన లేకపోవడంతోనే జరుగుతుంది.