సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. మొదటి రోజు 691 పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 62.8 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో దాదాపు 691 ప్రభుత్వ పాఠశాలల్లో 1,14,607 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో ఎన్రోల్మెంట్ కాగా… తొలి రోజు 72,028 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో ఆర్ రోహిణి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు మొత్తం 88 శాతం స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన 2023-24 విద్యా క్యాలెండర్ను అమలు చేసేలా జిల్లా విద్యాధికారులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు నమోదు చేయాలన్న లక్ష్యంతో పాఠ్య ప్రణాళికలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
బడిబాట ద్వారా 6,684 మందికి అడ్మిషన్లు ..
జిల్లాలో బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. సోమవారం వరకు 6684 మందికి అడ్మిషన్లు ఖరారు చేసినట్లు డీఈవో ఆర్ రోహిణి వెల్లడించారు. తొలి రోజు ఏకంగా 719 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఇందులో అంగన్వాడీ నుంచి 135 మంది, ప్రైవేటు స్కూల్స్ నుంచి 84 మంది, నేరుగా వచ్చిన అడ్మిషన్లు 500, కాగా మొత్తం 719 అడ్మిషన్లు నమోదైనట్లు పేర్కొన్నారు.
మేడ్చల్లో 2,010 అడ్మిషన్లు..
మేడ్చల్, జూన్12(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు 2,010 అడ్మిషన్లు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి విజయకుమారి తెలిపారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 375, ప్రాథమికోన్నత పాఠశాలలు 22, ఉన్నత పాఠశాలలు 108, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి మొత్తం 515 పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో 92,102 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నెల 17 వరకు బాడిబాట కొనసాగనున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాధికారి తెలిపారు.