మణికొండ, ఫిబ్రవరి 4 : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నదని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన బొద్దుల రమేశ్ (38)గా గుర్తించారు.
మణికొండ ప్రాంతానికి చెందిన వెంకటేశ్, శ్రీకాంత్రెడ్డిలతో కలిసి బొద్దుల రమేశ్ తన కారులో ఈ నెల 3న ఉదయం యాదగిరిగుట్టకు వెళ్లా. మార్గ మధ్యలో ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ ప్రాంతానికి చేరుకున్నారు.
కారులో పెట్రోల్ అయిపోవడంతో దారి మధ్యలోనే కారును నిలిపి వెంకటేశ్, శ్రీకాంత్రెడ్డిలను అక్కడ నుంచి పంపించి, రమేశ్ కారులోనే పడుకున్నాడు. ఉదయం గమనించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోస్టుమార్టం నివేదిక ఆధారం కేసు దర్యాప్తు చేస్తామని సీఐ హరికృష్ణారెడ్డి తెలిపారు.