కుత్బుల్లాపూర్,జూన్16 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం..ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయాలనే మంచి ఆలోచనతో వార్డు కార్యాలయాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ల కృషితో అందుబాటులోకి వచ్చాయని కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట మోడల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన నూతన వార్డు కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు కార్యాలయాల ద్వారా 10 మంది శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉంటారని, సత్వరమే వారి సమస్యలను పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. నగరంలో 150 వార్డుల్లో 1500 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారానికి నాంది పలికేలా చర్యలు తీసుకుంటారన్నారు. గత పాలకుల హయాంలో జగద్గిరిగుట్ట అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో కోట్ల వ్యయంతో అడుగడుగునా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అందుబాటులో ఉన్న స్థలంలో మెడికల్ కళాశాల, బస్టర్మినల్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాజుల రామారం సర్కిల్ ఉప కమిషనర్ ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.