అడ్డగుట్ట, ఏప్రిల్ 6 : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్నగర్లో 48 మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్లకు డప్పుచప్పుల నడుమ స్థానిక మహిళలు బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారులు పద్మారావు, మహమూద్ అలీల సమక్షంలో సామూహిక గృహప్రవేశాలు చేశారు.ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో 111 ప్రాంతాల్లో లక్ష గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పైసా ఖర్చు లేకుండాపేదలకు రెండు పడకల గదుల ఇండ్లు లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
పేదల ప్రయోజనాల కోసం డిప్యూటీ స్పీకర్ పద్మారావు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రాంతంలో స్థలాల కొరత కారణంగా నాలుగు ప్రదేశాల్లో 419 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించగలిగామని చెప్పారు. అర్హులైన పేదలకు ఇతర ప్రాంతాల్లో అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అడ్డగుట్ట ప్రభుత్వ దవాఖాన నిర్మిస్తామని, ఆజాద్ చంద్రశేఖర్నగర్ను సమస్యలరహితంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఇళ్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వమే రూ.3లక్షలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్, రాసూరి సునీత, సామల హేమ, హౌజింగ్ ఓఎస్డీ సురేశ్కుమార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, ఆర్డీవో వసంతకుమారి, హౌజింగ్ సెల్ ఇంజినీర్ వెంకట దాస్, బీఆర్ఎస్ యువ నాయకులు రామేశ్వర్గౌడ్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి, నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పెండెం మనోహర్, నక్కమధు, మధు గౌడ్, సత్తయ్య గౌడ్, పొన్నాల రాజు, వడ్డెర ఎల్లయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.