బంజారాహిల్స్, మే 17: బస్తీవాసులకు అవసరమైనంత మేర తాగునీటిని అందించడంతో పాటు కలుషిత నీటి సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి ఆధ్వర్యంలో వేసిన మంచినీటి పైపులైన్ నుంచి తన ఇంటికి అక్రమంగా నాలుగు లైన్లను తీసుకున్న భవన యజమానిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎన్బీటీనగర్ బస్తీలో వసంత్కుమార్ అనే వ్యక్తి ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఈ ఇంటి ముందు ఇటీవల జలమండలి ఆధ్వర్యంలో కొత్తగా వాటర్ పైపులైన్ వేశారు. కాగా జలమండలి సిబ్బంది కండ్లు గప్పి అతడు తన ఇంటిముందు వెళ్తున్న ఫీడర్ లైన్ను ధ్వంసం చేసి రెండు వేర్వేరు చోట్ల నాలుగు 20 ఎంఎం డయా అక్రమ కనెక్షన్లను తీసుకున్నాడు.
మంగళవారం కొత్తగా వేసిన లీకేజీలను పరిశీలిస్తున్న జలమండలి అధికారులు వసంత్కుమార్ తీసుకున్న నాలుగు అక్రమ కనెక్షన్లను గుర్తించి… మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. మేయర్ వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయించాలని జలమండలి మేనేజర్ రాంబాబును ఆదేశించారు. వసంత్కుమార్ పై చర్యలు తీసుకోవాలని జలమండలి మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.