కుత్బుల్లాపూర్, మార్చి 19:ఆక్రమణదారులు ప్రైవేట్ వ్యక్తుల స్థలాల జోలికి వెళ్లకుండా, ప్రభుత్వ ప్రాపర్టీలైన చెరువులు, కుంటల మీదకు దూసుకొస్తున్నారు. వీటిలో కబ్జాలకు పాల్పడితే అడిగేవాడు ఉండడన్న ఉత్సుకతలో అధికారులతో కుమ్మక్కై దురాక్రమణకు తెర లేపుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ, 132 జీడిమెట్ల డివిజన్ సరిహద్దుల్లో ఉన్న సర్వే నం: 124 గల ఫాక్స్సాగర్ ఎఫ్టీఎల్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో కొద్ది రోజుల నుంచి ఇరిగేషన్, రెవెన్యూతో పాటు కొంపల్లి మున్సిపాలిటీ అధికారుల కనుసన్నల్లో చెరువు స్థలాలకు రక్షణ లేకుండా పోతుందని, రోజురోజుకు చెరువు కుచించుకుపోతుందని దూలపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పలు విభాగాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నిలయంగా మారింది. ఈ క్రమంలో వ్యాపార సముదాయాలకు అనువుగా ఉన్న ప్రదేశంలో కొంతమేరకు ప్రైవేట్ భూములు ఆనుకొని ఉండగా, దానికి అదనంగా ఫాక్స్సాగర్ చెరువు ఎఫ్టీఎల్ జోన్ కింద వచ్చే స్థలాల్లో ఆక్రమణదారులు తప్పుడు పత్రాలను సృష్టించి చెరువు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకవైపు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కొంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు నిర్మాణాలను నిలిపివేయకపోగా, వాటిని ప్రోత్సహిస్తున్నట్టు దూలపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాల వెనక అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత దగ్గరుండి నిర్మాణాలు చేపిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరిని వివరణ కోరగా తమ సిబ్బందిని అక్కడికి పంపించి పనులను నిలిపివేయిస్తామని చెప్పడం గమనార్హం.