సిటీ బ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు వివాదాస్పద స్థలాల్లో మూడు నుంచి నాలుగు అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలున్నాయి.
తాజాగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ హనుమాన్ గుడి పక్కన ఇంటినెబర్ 1-95లో ఎలాంటి అనుమతులు లేకుండా వివాదంలో ఉన్న స్థలంలో గతంలోనే జీప్లస్ టూ భవనం నిర్మించారు. మొత్తం సుమారుగా 250 గజాల స్థలంలో 120 గజాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆ ఇంటికి పన్ను కూడా 120 గజాలకు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా ఆ ఇంటిపై మరో ఫ్లోర్ నిర్మిస్తున్నారు.
ఈ విషయమై నార్సింగి సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా గతనెల 16న షోకాజు నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో ఇప్పటికే ఉన్న జీప్లస్ టూ భవనంపై అదనపు అంతస్తు ఎందుకు నిర్మిస్తున్నారు? అనుమతులు ఉన్నాయా? అనుమతులు తీసుకోకుంటే నిర్మాణం కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారుల నోటీసులను పట్టించుకోకుండా ఇంటి యజమాని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సదరు నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి యజమాని నుంచి అధికారులకు ఆమ్యామ్యాలు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.